సాక్షిపై మొదటి పేజీల్లోనా: రామోజీరావు ఈనాడుపై రోజా ఫైర్
వైయస్ తన సొంత కష్టంతో అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం కాబట్టే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదన్నారు. ఆ మాటను జగన్ ఢిల్లీ దీక్షలోనే స్పష్టంగా చెప్పారన్నారు. అయినప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు దమ్ముంటే పడగొట్టండంటూ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ వారసుడి అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి కిరణ్ ఆయనను కించపరుస్తున్నారన్నారు. పివికి వైయస్ను పరిచయం చేశానని చెప్పడం, హెలికాప్టర్ ప్రమాదానికి ముందే తాను డ్రాప్ అయ్యానని చెప్పడం ఆయనపై బురదజల్లేందుకే అన్నారు. ప్రమాదానికి ముందు ఆయన ఎందుకు డ్రాప్ అయ్యారని ప్రశ్నించారు. జగన్ ఇమేజ్ దెబ్బతీయడానికే దివంగత పరిటాల రవి హత్యలో ఆయనను రక్షించానని చెబుతున్నారని ఆరోపించారు. వైయస్ ఆకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని అయినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబ్బులు అందలేదని చెప్పారు. చనిపోయిన వారివి కూడా దొంగలేక్కలని కాంగ్రెస్ నేతలు అనడంపై సిఎం ఎందుకు స్పందించడం లేదన్నారు. వైయస్ మీద అంత అభిమానం ఉంటే నెల రోజుల వరకు ఎందుకు సంతాప తీర్మానం చేయలేదన్నారు.
జగన్ సమావేశాలకు వెళితే రాజీనామాలు చేయాలని సిఎం చెప్పటం వైయస్పై అభిమానం ఉన్నట్టా అని ప్రశ్నించారు. మీకు అంత విశ్వాసమే ఉంటే పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. 2009 ఎన్నికల క్రెడిట్ వైయస్దే అన్నారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలకు విశ్వాసం ఉన్నది కాబట్టే వారు ఆయన వెంట ఉన్నారన్నారు. తమకు టిక్కెట్లు ఇచ్చిది, తమ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసింది వైయస్ అని వారు స్పష్టంగా చెబుతున్నారన్నారు. సోనియా, రాహుల్ ఇమేజ్ వారిని గెలిపించలేదన్నారు. వారి ఇమేజ్ గెలిపిస్తుందనుకుంటే బీహార్లో అంత ఘోరంగా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. 2009 ఎన్నికలకు ముందే గెలుపైనా, ఓటమి అయినా నాదే బాధ్యత అని వైయస్ చెప్పారన్నారు. విపక్షాలన్నీ కలిసినా వైయస్ను ఎదుర్కోలేక పోయారన్నారు. కాంగ్రెస్లో ఉన్నవారే తాము వైయస్ బొమ్మతో గెలిచామో, సోనియా బొమ్మతో గెలిచామో తెలుసుకోవాలన్నారు.
రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని సోనియా, రాహుల్ గాలికి వదిలేశారన్నారు. జగన్ ప్రజా సమస్యలపై దీక్షలు చేస్తుంటే ఒక్క పత్రిక అయినా మొదటి పేజిలో ప్రచురించిందా అని ప్రశ్నించింది. రామోజీరావు నేతృత్వంలోని ఈనాడుపై ఆమె పరోక్ష విమర్శలు చేశారు. ఆయన అక్రమ ఆస్తులపైన, సాక్షిలో ఎన్నికోట్లు తిన్నారనే విషయంపై మొదటి పేజీలో వేశారన్నారు. కానీ ప్రజాస్పందనలపై ఏ పత్రికా ప్రచురించలేదన్నారు. జగన్కు ప్రజలు, రైతుల మద్దతు ఉందన్నారు. వైయస్ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ పలు ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. జగన్ ధైర్యంగా ప్రభుత్వాన్ని పడగొట్టనని చెబితే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారన్నారు. జగన్ చెబితే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాని ఆయనకు నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారన్నారు. వైయస్ ఉన్నప్పుడు జగన్పై ఆరోపణలు చేయని వారు ఇప్పుడు చేస్తున్నారన్నారు. వైయస్ చనిపోయాక, జగన్ పార్టీ వీడాకే ఆయన అక్రమ ఆస్తులు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి నైతికత ఉంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు.