ముఖ్యమంత్రి కిరణ్కి చిరంజీవి ఎంట్రీ చిక్కులు: బొత్స, డిఎస్కు అంతే!
వచ్చే ఎన్నికలలో చిరంజీవి సిఎం అభ్యర్థిగా ఉండటం వలన కాంగ్రెసు నేతలు చిరు గ్రూపుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారు కిరణ్ను చూసీ చూడనట్లుగానే ఉంటారు. తన నాయకత్వంలో కాంగ్రెసు ప్రభుత్వం 2014లో ఏర్పడుతుందని ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా సిఎంకు లేకుండా పోయింది. కాంగ్రెసు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. దివంగత వైఎస్ సిఎం అయిన తర్వాత గ్రూపు రాజకీయాలకు తెరపడింది. కొద్దో గొప్పో ఉన్నా అవి నామమాత్రంగానే ఉండిపోయాయి. అనంతరం రోశయ్య, కిరణ్ హయాంలో కూడా ఉన్నప్పటికీ కాంగ్రెసు సంక్షోభంలో ఉన్న కారణంగా అవి పెద్దగా కనిపించకుండానే మాయమై పోయాయి. ఇప్పుడు చిరు రావడంతో గ్రూపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కిరణ్తో పాటు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్కు సైతం చిరు రాక దెబ్బే. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా అధిష్టానం పార్టీకి సంబంధించిన అన్ని పనులను చిరుకు అప్పగిస్తే డిఎస్ పని అంతే. ఇన్నాళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ డిఎస్కు ప్రత్యేక గ్రూపులు అంటూ ఏమీ పెద్దగా లేవు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కిరణ్ ఉన్నందున పార్టీ వ్యవహారాలను డిఎస్కు కాకుండా చిరుకు అప్పగించే అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా డిఎస్ ప్రతిష్టకు భంగకరమే. ఆయన ఎన్నాళ్లనుండో కలలు కంటున్న ముఖ్యమంత్రి పీఠం ఆయనకు ఇక కలగానే మిగలనుంది.
వైఎస్ మరణం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ముఖ్యనేతగా మారారు. ఆయన ఓ సమయంలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. ఆయనకు ఉత్తరాంధ్రలో మంచి పట్టు ఉంది. ఆయన తన సామాజిక వర్గంతో గట్టి పట్టు సాధించారు. మరో ముఖ్య విషయం ఏమంటే ఇటు తెలంగాణ, ఆటు సీమాంధ్ర ప్రజల ఆమోదం పొందిన వ్యక్తి బొత్స సత్యనారాయణ కావడం గమనార్హం. తెలంగాణ వచ్చినా, రాకున్న తనకు ఏమీ ఇబ్బంది లేదని పలుమార్లు చెప్పారు. అయితే సిఎం, బొత్స, డిఎస్లు చిరంజీవి రాకను ఆహ్వానించడం విశేషం. చిరు రాకతో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.