చెత్తను తెచ్చారు: చిరంజీవిపై జగన్ వర్గం కొండా సురేఖ వ్యాఖ్య

Konda Surekha
వరంగల్: చిరంజీవిని కాంగ్రెసు పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెసు‌కు భస్మాసుర హస్తమే అవుతుందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు నేత ఎమ్మెల్యే కొండా సురేఖ బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. చిరంజీవిని పార్టీలోకి తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. ఆయన సామాజిక వర్గం కోసమే చిరును కలుపుకుంటే పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆయన సామాజిక వర్గం నేతే కదా అని ప్రశ్నించారు. పార్టీలో ఆయన సామాజిక వర్గం వారు ఎవరూ దొరకలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పిన రోశయ్యకు, మంత్రిగా అనుభవం లేని కిరణ్‌కుమార్ రెడ్డికి సిఎం పదవిని ఇచ్చారు. మరి అనుభవం ఉన్న డిఎస్‌కు ఎందుకు ఇవ్వలేదన్నారు. చిరంజీవి ఓ మహిళ చేతిలో పాలకొల్లు నియోజకవర్గంలో ఓడిపోయారని, అలాంటి వ్యక్తి ఇమేజ్ పార్టీకి ఎలా కలిసి వస్తుందన్నారు.

పీఆర్పీ ఎమ్మెల్యేలే ఆయన వెంట లేరని చెప్పారు. కాంగ్రెసు పార్టీనుండి విడిపోయి మళ్లీ కాంగ్రెసు‌లో విలీనం అయిన పార్టీలు ఉన్నాయి. కానీ కొత్తగా స్థాపించిన పార్టీ గడప తొక్కడం 125 సంవత్సరాల కాంగ్రెసు‌కు దురదృష్టకరమన్నారు. చిరు కాంగ్రెసు‌లో చేరడం ఆయన పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది ఆమోదమే అయితే చిరుతో పాటు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెసు గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటకు పంపించి, చెత్తను తెచ్చుకున్నారని జగన్, చిరులను ఉద్దేశించి చెప్పారు. సమైక్యవాది అయిన చిరును కలుపుకోవడం వల్ల కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకూడదని అనుకుంటుందా అని ప్రశ్నించారు. వైయస్ అధిష్టానానికి పీఆర్పీ విలీనంపై లేఖ రాస్తే చిరుకు తెలియకుండా ఎలా ఉంటుందన్నారు. వైయస్ మరణించినప్పుడు సంతకాల సేకరణ విషయంలో జగన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసారు. మంత్రుల అభివృద్ధిపై కాకుండా జగన్‌పై దృష్టి పెడుతున్నారన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై కూడా ఆమె విరుచుకు పడ్డారు.

రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీలపై మాకు ఎప్పుడూ అభిమానం ఉందని, సోనియాపై కూడా నిన్నటి వరకు ఉండేదని, అయితే వైయస్ కుటుంబాన్ని ముక్కలు చేసిన కారణంగా ఆమె గౌరవం కోల్పోయిందన్నారు. మేం తప్పు చేశామా లేదా అనే విషయాన్ని ప్రజలు తేల్చుతారన్నారు. డిఎస్‌తో మంతనాలు జరిపినట్టు నిరూపించినా, జగన్‌తో ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నట్టు నిరూపిస్తే మేం వరంగల్ నుండి వెళ్లిపోవడమే కాకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటామని, అయితే నిరూపించలేకుంటే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మూసి వేసుకుంటుందా అని సవాల్ చేశారు. డిఎస్ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కాబట్టి ఆయనను మంచి పదవిలో చూసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. వైయస్ తర్వాత మేం అభిమానించే వ్యక్తి డిఎస్ అన్నారు. జగన్ చెబితే మేం చేసే వాళ్లం కాదన్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, శాశ్వత మిత్రులు ఉండరని అన్నారు. జగన్‌తో హరితయాత్రలో పాల్గొననంత మాత్రాన జగన్‌కు మద్దతు ఇవ్వనట్టు కాదన్నారు. మేం ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామన్నారు. ఆయన సమైక్యవాది కాదన్నారు. ఆయన తన వాయిస్ ఇంకా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం జన్మభూమిని తలపిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం వద్దనే వాదనతో నేనూ ఏకీభవిస్తున్నానని చెప్పారు. మంత్రులు ఒకరికి ఒకరు సమన్వయం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వైయస్ అవినీతిపరుడుని చిరంజీవి చేసిన ఆరోపణలు ఒక్క మంత్రి ఖండించలేదన్నారు. కాంగ్రెసు పార్టీకి సరియైన నాయకుడు కరవయ్యాడన్నారు. ఈ ప్రభుత్వం 2014 వరకు కొనసాగవచ్చు, కొనసాగక పోవచ్చునన్నారు. అయితే కాంగ్రెసు‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+