Success Story: ఒకప్పుడు నెలకు వెయ్యి.. ఇప్పుడు ఏడాదికి 70 కోట్లు.. ఈ 'తెలంగాణ రైతు' స్టోరీ తెలుసా..?
నేటి జెన్ జీ యువత వ్యవసాయం వైపు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పట్నంలో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటున్నారు. కానీ.. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు చేస్తున్న ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి మరీ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారికి తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఓ రైతు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాదిరి.. ధృడమైన సంకల్పం, పట్టుదల, ఓర్పు సహనంతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ఇదే వ్యవసాయంలో నెలకు వెయ్యి రూపాయలకు పని చేసి ఇప్పుడు ఏకంగా ఏడాదికి ఏకంగా 70 కోట్లు రాబడుతున్నారు. అంతేకాక దాదాపు 200 నుంచి 300 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ తెలంగాణ రైతు సక్సెస్ స్టోరీ మీకోసం..
రెక్కాడితే కానీ డొక్కాడని ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు శ్రీకాంత్ బొల్లపల్లి. అందరిలాగే చదువుకుని ఉద్యోగం చేయాలని కలలు కన్నారు. కానీ కుటుంబం కడు పేదరికంలో ఉన్న కారణంగా శ్రీకాంత్ పదోతరగతి ఫీజు కట్టలేక మధ్యలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఓవైపు పేదరికం.. మరోవైపు అప్పులు.. ఈ నేపథ్యంలో ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితి.. అలా 16 ఏళ్లకే తమ బంధువుల సాయంతో బెంగళూరులోని ఓ పూల మార్కెట్ లో నెలకు రూ. 1000 కు పనికి కుదిరారు శ్రీకాంత్. అక్కడే రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడ్డారు. పూలసాగు, కోత పద్దతులు, గ్రేడింగ్, మార్కెటింగ్ అలాగే ఎగుమతి తదితర అంశాలపై పూర్తి పట్టు సాధించారు.
అలా కుటుంబం, బంధువుల సాయంతో కేవలం రూ. 20 వేల పెట్టుబడితో బెంగళూరులోని విల్సన్ గార్డెన్ లో ఓం శ్రీసాయి ఫ్లవర్స్ అనే చిన్న దుకాణం ప్రారంభించారు. అలా దాదాపు 10 ఏళ్లపాటు పూల వ్యాపారం చేశారు శ్రీకాంత్. ఆ తర్వాత స్వయంగా పూలు అమ్మడమే కాకుండా.. పూలు పండించాలని ఆలోచన వచ్చింది. ఈ మేరకు నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి రుణాలు, సబ్సిడీలు పొందారు. అలా బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబల్లాపుర వద్ద మొదటగా 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంసై ఫ్లోరిటెక్ సంస్థను స్థాపించారు.

10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఇప్పుడు 52 ఎకరాలకు పెరిగింది. గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా అనేక రకాల పూలను శ్రీకాంత్ సాగు చేశారు. ఈ పూలసాగుతో ఏడాదికి 70 కోట్ల టర్నొవర్ సాధిస్తున్నారు. పూర్తి ఆధునిక గ్రీన్ హౌజ్ లు, పాలీ హౌజ్ పద్ధతిలో పూలసాగు చేస్తున్నారు. అలాగే 200 నుంచి 300 మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్.. భారత్ పూలసాగు దారుల సంక్షేమం కోసం పనిచేసే గ్రోయర్స్ ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ సేవలు అందిస్తున్నారు. చాలామంది వ్యవసాయాన్ని కేవలం జీవనాధారణంగానే భావిస్తున్న తరుణంలో శ్రీకాంత్.. ఒక లాభదాయకమైన కార్పొరేట్ బిజినెస్ లాగా మార్చుకున్నారు.












Click it and Unblock the Notifications