అజ్ఞాతంలోకి వెళ్లిన తెలుగు సినీ నిర్మాత శింగనమల రమేష్
తనను కల్యాణే మోసం చేశారంటూ శింగనమల రమేష్ ఒక పోలీసు అధికారికి చెప్పినట్టు సమాచారం. ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి ఫిర్యాదు ఆధారంగా గత నెల శింగనమలపై సీసీఎస్ అధికారులు కేసు నమోదు చేసినప్పుడు కొన్ని విషయాలను ఫోన్ ద్వారా వివరించినట్టు తెలిసింది. ఫైనాన్షియర్గా ఉన్న తాను నిర్మాతగా మరింత పేరు తెచ్చుకునేందుకు ఏకకాలంలో 'ఖలేజా', 'కొమరం పులి' చిత్రాల నిర్మాణం ప్రారంభించానని వివరించారు. సమస్యలు రావడంతో బడ్జెట్ పెరిగిపోయిందని, అప్పుడు కల్యాణ్ను సంప్రదించానని శింగనమల ఆ అధికారితో అన్నట్లు సమాచారం.
రెండు చిత్రాలు విడుదల చేసే బాధ్యత తీసుకున్న కల్యాణ్ అనంతరం భాను కిరణ్ను భాగస్వామిగా కలుపుకొన్నారు. రెండు చిత్రాలు విడుదల చేసేందుకు ముందు అప్పులు తీరుస్తామని అంగీకరించారని అంటున్నారు. ఇందుకుగాను శింగనమలకు చెందిన రూ.20 కోట్ల ఆస్తులను రాయించుకున్నారు. వీడియో హక్కులు తీసుకున్నారు. షాలిమార్ వీడియోస్ యజమాని అష్రఫ్ వద్ద రూ.30 లక్షలు కల్యాణ్ తీసుకుని, చాలా తెలివిగా తన నిర్మాణ సంస్థలో జమ అయినట్టు చూపించినట్లు వార్తలు వచ్చాయి. చిత్రాలు విడుదలయ్యాక అప్పులతో తమకు సంబంధం లేదంటూ కల్యాణ్, భాను తేల్చిచెప్పారు. రుణం రూ.కోట్లలో ఉండటం, ఆస్తులు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో చెన్నైలో ఉన్నానని శింగనమల పోలీసు అధికారులకు వివరించినట్టు తెలిసింది.
మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్పై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన వ్యక్తి బుధవారం సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో తనను బెదిరించి 5.17 ఎకరాల భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ప్రాథమిక వివరాలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం భానుకిరణ్పై కేసు నమోదు చేశామని డీసీపీ(నేరాలు) సత్యనారాయణ తెలిపారు.