2జి స్కామ్ డబ్బులతో మాకు సంబంధం లేదు: డిఎంకె చానెల్
డిబి రియాల్టీ అండ్ స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వా రాజాకు ఆ డబ్బులు లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజా హయాంలో విపరీతంగా ప్రయోజనం పొందిన రెండు కంపెనీల్లో ఇది ఒకటి. బాల్వాను సిబిఐ మంగళవారం ముంబైలో అరెస్టు చేసింది. డబ్బులు డిబి గ్రూప్ ద్వారా చెన్నై చేరడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సినీయుగ్ను వాడుకున్నట్లు తెలుస్తోంది. సినీయుగ్ ద్వారా డబ్బులు కలైంగర్ టీవీ చానెల్కు చేరాయని అంటున్నారు.
అయితే, 2జి స్కామ్తో తమకు ఏ విధమైన సంబంధం లేదని కలైంగర్ టీవీ స్పష్టం చేస్తోంది. సినీయుగ్ తమ సంస్థలో ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టిందని, వాల్యుయేషన్ తేడా వల్ల 200 కోట్ల రూపాయలను రుణంగా పరిగణించామని, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా 2009లో తిరిగి చెల్లించామని చెబుతోంది. లావాదేవీలో ఏ విధమైన అక్రమం లేదని, అన్ని నిబంధనలను పాటించామని, ఈ విషయం ఆదాయం పన్ను శాఖకు తెలుసునని వివరించింది.