తెరాస అవిశ్వాసంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు?
ప్రస్తుతం ప్రభుత్వానికి 155 మంది సభ్యులున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైపు 20 మంది సభ్యులున్నారని భావిస్తే, వారు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వానికి 16 మంది ప్రజారాజ్యం శాసనసభ్యుల మద్దతు లభిస్తుంది. అదే విధంగా ఏడుగురు మజ్లీస్ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు లేకపోయినా ప్రభుత్వానికి 151 మంది సభ్యుల బలం ఉంటుంది. మెజారిటికీ కావాల్సిన 148 మంది సభ్యుల కన్నా ముగ్గురు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ప్రభుత్వం పడిపోయే స్థితి లేదు.
అయితే, ఆ విషయం కెసిఆర్కు తెలియదని అనుకోలేం. కేవలం తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను ప్రజల ముందు తెలంగాణ వ్యతిరేకులుగా నిలబెట్టడమే ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చు. ఇటీవల తెరాసకు మద్దతిచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డితో కలిపితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 39 మంది ఉన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 50 మంది ఉన్నారు. వీరంతా పార్టీని కాదని తెరాస ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారని అనుకోవడానికి లేదు. అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వని తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని కెసిఆర్ భావిస్తున్నారని చెప్పవచ్చు. దీనివల్ల తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసససభ్యుల తీరును మరింతగా ఎండగట్టడానికి వీలవుతుందని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు.