28 తర్వాత తెలంగాణపై పార్లమెంటులో చర్చ: కేశవరావు

అంతకు ముందు లోకసభలో ఆందోళనకు దిగిన తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులను బుజ్జగించేందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. తెలంగాణ అంశంపై ఆందోళనతో లోకసభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రధానిని కలిశారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పవన్ కుమార్ బన్సల్లను కూడా వారు కలిశారు. తెలంగాణ సీరియస్ అంశమని, తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని, అప్పటి దాకా ఓపిక పట్టాలని ప్రధాని తెలంగాణ పార్లమెంటు సభ్యులకు చెప్పారు.
తనతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమైన తర్వాత ప్రధాని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు చర్య సరైంది కాదని మొయిలీ అన్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ పట్టు వీడలేదు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని వారు ప్రధానితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు.