మార్చి 1వ తేదీన 24 గంటల పాటు రైల్ రోకో: కోదండరామ్
మార్చి 1వ తేదీ రైల్ రోకో ముగిసిన తర్వాత హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ఈజిప్టులోని తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమాన్ని మరిచిపోయేలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఉద్యమం తర్వాత అందరూ ఈజిప్టు తరహా అనడం మానేస్తారని, తెలంగాణ తరహా అని అంటారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణను కొనసాగిస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారని, అంతగా ముందుకు వస్తున్న వారికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శుక్రవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి కెసిఆర్, విజయశాంతి గురువారం హైదరాబాదు చేరుకున్నారు. మార్చి 1వ తేదీ తర్వాత వారు లోకసభను స్తంభింపజేయడానికి తిరిగి ఢిల్లీ వెళ్తారు.