అసెంబ్లీలో తెలంగాణ గొడవ: శ్రీధర్ బాబుపైకి దూసుకెళ్లిన కొత్తకోట
సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయితే, తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. వారికి సిపిఐ సభ్యులు మద్దతు పలికారు. ఇప్పటి వరకు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు సోమవారం సభకు రాలేదు. వారి పాత్రను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు పోషించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జోక్యం చేసుకుని - తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా నెపాన్ని తమపైకి నెడుతోందని ఆయన అన్నారు. రాజధాని తెలంగాణలో ఉన్నందున రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు వారి వారి ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. సభ సద్దుమణగకపోవడంతో ఉప సభాపతి మనోహర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.