నాగం జనార్దన్ రెడ్డి మెత్తబడ్డారా?, చంద్రబాబుతో సమావేశం
తెలంగాణ ఎమ్మెల్యేల భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వేణుగోపాలాచారి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, జైపాల్ యాదవ్, మహేందర్ రెడ్డి సోమవారం రాత్రి నాగం ఇంటికి వెళ్లారు. సుమారు 3 గంటలపాటు ఆయనతో చర్చించారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని నాగం వారితో చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరు కాకుండా ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయంతోనే తాను సభను స్తంభింపజేశానని చెప్పారు. అయితే, చంద్రబాబు సభలో ఉండగా అలా వ్యవహరించడం బాధ కలిగించిందని వారు నాగం జనార్దన్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం.
శాసనసభా సమావేశాలను ఈ నెల 10వ తేదీన జరిగే మిలియన్ మార్చ్ ముగిసే వరకు బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం వారు శాసనసభకు హాజరు కాలేదు. మిలియన్ మార్చ్పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభకు హాజరయ్యేంత వరకు తాము కూడా సభకు దూరంగానే ఉండాలని వారు నిర్ణయించుకున్నారు.