వైయస్ జగన్ భద్రత కుదింపుపై దుమ్మెత్తిపోసిన సాక్షి డైలీ
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కితీసేసుకోవడం చూస్తే దీని వెనక దురుద్దేశం ఉన్నట్టు అవగతమవుతోంది. జడ్ ప్లస్ "కేటగిరీ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్ కోసం ఇటీవలే ఎనిమిది కొత్త టాటా సఫారీ వాహనాలను సమకూర్చారు. ఆయన భద్రతను ఇటీవల కాలంలో మరింతగా పెంచారు. వీఐపీలకు ఉండే ముప్పు దృష్ట్యా ఇది తప్పనిసరి. అదే సమయంలో అత్యంత జనాదరణ కలిగిన యువనేత భద్రత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది" అని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. "రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు హైదరాబాద్ నుంచి వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సైతం గత నవంబరులో మరమ్మతుల కోసమని వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పటివరకు దాన్ని తిరిగి పంపలేదు. అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్లో రెండు చోట్ల వాహనాలను వెనక్కి తీసుకున్నారు" అని వివరించింది.
ఓదార్పు, పరామర్శలు, ప్రజాందోళనలో భాగంగా జగన్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిసారీ ఆయన భద్రత ఆందోళన కలిగిస్తోందని, కొన్ని జిల్లాల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం లేదని, ఇటీవల గుంటూరు జిల్లాలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తెనాలి రైల్వేస్టేషన్ కువేలాది మంది అభిమానులు వచ్చారని, అప్పుడు భద్రత సిబ్బంది సరైన రీతిలో చర్యలు తీసుకోకపోవడంతో జగన్ జనం మధ్యలో ఇబ్బందులకు గురయ్యారని వివరించింది.