శ్రీకాకుళం జిల్లా పర్యటనలో వైయస్ జగన్కు చేదు అనుభవం
Districts
oi-Pratapreddy
By Pratap
|
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితుల పరామర్శ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ ప్రాజెక్టులో జగన్కు, ఆయన బావ అనిల్ కుమార్కు వాటాలున్నాయా, లేదా చెప్పాలని బాధితులు నిలదీశారు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ''బాబూ మీకు, మీ బావ అనిల్కుమార్కు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో వాటాలున్నాయని అందరికీ అనుమానాలున్నాయి. మీరు ఏమంటారో వివరణ ఇచ్చి మద్దతు తెలపండ''ని ఆకాశలఖవరం గ్రామానికి చెందిన భాస్కరరావు అనే వ్యక్తి జగన్ను ప్రశ్నించారు. దీంతో ఒకింత అసహనానికి గురైన జగన్ తన తండ్రి మంచి కార్యక్రమంగానే అనుమతులిచ్చారని, కాకరాపల్లి విద్యుత్కేంద్రంలో తనకు, తమ బావ, బామ్మర్దులకు వాటాలు ఉన్నట్లు ఆరోపించడం తగదన్నారు. ఇదంతా ప్రభుత్వం, ప్రతిపక్షాల కుట్ర మాత్రమేనన్నారు. థర్మల్ పోరాటాన్ని ముందుడి నడిపిస్తానని ప్రకటించారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర 'రైతు-మత్స్యకార మహాధర్నా' కార్యక్రమం ప్రారంభించారు. జనం తక్కువగా ఉండడంతో వెంటనే తంపర గ్రామాలకు బయల్దేరారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలఖవరం, వడ్డితాండ్ర, సీరపువానిపేట, పోతినాయుడిపేట గ్రామాల్లో థర్మల్ బాధితుల్ని పరామర్శించారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జీరు నాగేశ్వరరావు, సీరపు ఎర్రయ్య కుటుంబాల్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ప్రజల ఆమోదం లేనప్పుడు ప్రాజెక్టు రద్దు చేయాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతలు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రినైతే వెంటనే థర్మల్ విద్యుత్కేంద్రాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు.
Ex MP YS Jagan faces problem on East Coast power project issue, when he visited victims. public questioned him about his shares in East Coast power project.
Story first published: Tuesday, March 8, 2011, 8:37 [IST]