జగన్ వర్గంలో అసంతృప్తి: పర్యటనలు పేలవం!
పార్టీకి ఆమోద ముద్ర పడిన తర్వాత కూడా ఇంకా జగన్ పార్టీని ప్రకటించక పోవడంతో జగన్ వర్గం తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ముంగిట్లో శాసనమండలి ఎన్నికలు, కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో దీక్షలు చేపడుతూ, పాదయాత్రలు చేస్తు గడుపుతున్నారు. కానీ మార్చి మొదటి లేదా రెండో వారంలో ఉంటుందన్న పార్టీపై మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో జగన్ వర్గం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలకు తోడు నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు.
ఉప ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో కూడా ఇంకా పార్టీ పెట్టకుండా ఉండటంతో జగన్ కార్యకర్తలతో పాటు, నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారు క్రమంగా జగన్కు దూరం కావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష, పోలవరం యాత్ర, ఫీజు పోరు, నేటి శ్రీకాకుళం మహాధర్నా వరకు జగన్కు క్రమంగా దూరం అవుతున్న నేతలే కనిపిస్తున్నారు. ముప్పై మంది ఎమ్మెల్యేలనుండి ఇరవై కంటే తక్కువకు ఫీజు పోరు దీక్షలో సంఖ్యాబలం తగ్గింది. జగన్ శ్రీకాకుళం పర్యటన చాలా పేలవంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. పార్టీ ప్రకటించకుండా నిమ్మతంగా ఉన్న జగన్ వెంట వెళ్లడానికి ఆయన అత్యంత దగ్గరగా ఉన్న నేతలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే మరికొన్నాళ్లు పార్టీ ప్రకటించకుండా ఉంటే జగన్ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని భావిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఇన్నాళ్లూ హడావుడిగా పార్టీని ప్రకటిస్తామని చెప్పి లాగి లాగి చివరకు మార్చిలో పార్టీని ప్రకటిస్తామని చెప్పారు. ఆ సమయంలో నేతలంతా జగన్ పార్టీ వచ్చేస్తుందంటూ హడావుడి చేశారు. ప్రముఖ సినీ ఆర్టిస్ట్ తోట తరణి కూడా జగన్ పార్టీ ప్రకటన బహిరంగ సభ కోసం ఇడుపులపాయలో స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ హడావుడి కనిపించడం లేదు. అయితే ఇందుకు తెలంగాణ ఉద్యమం ఒకటి కాగా, సీమాంధ్రలో కూడా తగ్గుతున్న జగన్ ప్రభావానికి తోడు, కాంగ్రెస్కు క్రమంగా బలం పెరుకుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ వీడినప్పుడు సానుభూతితోనే ఆయన వెంట నడిచినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సానుభూతి పరిమిత కాలమేనని, అది ఎప్పటికీ ఉంటుందనే భావనలో ఉండకూడదని జగన్పై ప్రజల సానుభూతిని గమనిస్తున్న పలువురు చెబుతున్నారు.