నాగం జనార్దన్ రెడ్డిపై మంట పెట్టింది చంద్రబాబు నాయుడేనా?
ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డిని ఒంటరిని చేసి పంపేందుకు తనకు సన్నిహితులైన మోత్కుపల్లి నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు, సండ్ర వీర వెంకటయ్య వంటి తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణపై కన్నా పదవిపైనే యావ ఎక్కువని, దానికోసమే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అనిపించడానికి ఇటీవల చంద్రబాబు సర్దుబాటు డ్రామా ఆడినట్లు చెబుతున్నారు.
ఒక మెట్టు దిగి వచ్చినట్లు కనిపించిన చంద్రబాబు ఆ తర్వాత తన వ్యూహానికి పదును పెట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం కాకుండా పార్టీకి ప్రయోజనం చేకూరేంత వరకు మాత్రమే ముందుకు సాగాలనేది చంద్రబాబు వ్యూహం. కానీ, నాగం ఆ లక్ష్మణరేఖను దాటి తెలంగాణ సాధన కోసం కార్యక్రమాల రూపకల్పన చేస్తుండడంతో, తెలంగాణ రాజకీయ జెఎసి కార్యక్రమాలకు మద్దతిస్తుండడంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నాగం జనార్దన్ రెడ్డిని పూర్తిగా ఇరకాటంలో పెట్టే చంద్రబాబు వ్యూహంలో భాగంగానే మోత్కుపల్లి నర్సింహులు ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు తాను నడవలేనని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరింత మంది కూడా ఆ అభిప్రాయాన్నే ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. అయితే, దాదాపు సగం మంది తెలంగాణ శాసనసభ్యులు చంద్రబాబు వైఖరితో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వారంతా నాగం జనార్దన్ రెడ్డిలా తెలంగాణ కోసం దూకుడుగా ముందుకు వస్తారని చెప్పలేం. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.