హీరోనని లగడపాటి అనుకుంటున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణను అడ్డుకునే కుట్రలో భాగంగానే లగడపాటి ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామని తాము భావిస్తుంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు లగడపాటి పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి అటువంటి ప్రకటనలు చేయడం వల్ల ఉద్రేకాలు పెరుగుతాయని ఆయన అన్నారు. విభజన కోసం తాము పోరాటం చేస్తున్నామని, కావాలంటే వారి అభిప్రాయాలను సీమాంధ్ర నాయకులు చెప్పుకోవచ్చునని, ఏది న్యాయమైతే దానికి అనుగుణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న విషయాలతో సీమాంధ్ర నాయకులు కరపత్రాలు పంచుతున్నారని, వాటిపై సంతకాలు కూడా పెట్టడం లేదని, దమ్ముంటే సంతకాలతో కరపత్రాలు పంచాలని ఆయన అన్నారు. లగడపాటి అతి తెలివిగా వ్యవహరిస్తున్న పిచ్చివాడని ఆయన వ్యాఖ్యానించారు.