జపాన్ ఫుకుషిమా రియాక్టర్లలో తాజాగా మరో పేలుడు
చెలరేగిన మంటలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువవడం చూసి అధికారులు అణుకేంద్రం పరిసరాల్లో 30 కి.మీ. వరకు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. లేదా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా సూచిస్తున్నారు. ఆ ప్రాంతం మీదుగా విమానాల రాకపోకల్ని కూడా నిషేధించారు.ఎగిసి పడుతున్న మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. వేడెక్కుతున్న ప్లాంట్లపై హెలికాప్టర్లతో చల్లటినీరు చల్లాలని న్యూక్లియర్ వాచ్డాగ్ ఏజెన్సీ సూచించింది.
ఫుకుషిమా కేంద్రంలో మొత్తం ఆరు న్యూక్లియర్ రియాక్టర్లున్నాయి. ఒకటి, మూడు రియాక్టర్లున్న భవనాల్లో శని, సోమ వారాల్లో పేలుళ్లు సంభవించాయి. మంగళవారం రెండో రియాక్టరు ఉన్న భవనంలో పేలుడు సంభవించింది. తాజాగా నాలుగో సారి నాలుగో రియాక్టర్ వద్ద పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల కారణంగా పరిసరాల్లో రేడియేషన్ వ్యాప్తిని జపాన్ భద్రతా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి.