జగన్ వర్గం కన్న గడాఫీ బెటర్: చంద్రబాబు పరోక్ష వ్యాఖ్య
ఇలాంటి ఓట్లతో కొంటున్న డబ్బు రాజకీయం చూస్తుంటే మన నాయకులకన్నా లిబియా నేత మమ్మద్ గడాఫీయే బెటర్ అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వల్ల గత సాధారణ ఎన్నికల్లో 45 సీట్లు కోల్పోయామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ వర్గం, కాంగ్రెసు ఏకమయ్యాయని ఆరోపించారు. మా ఓట్లు ఎక్కడా కాంగ్రెసుకు పడలేదన్నారు. కొన్నిచోట్ల మాత్రం డబ్బులకు కొన్నారని అన్నారు. జగన్ తీరు, కెసిఆర్ తీరు చూస్తుంటే వారు కూడా చిరంజీవి బాటలో నడుస్తారని అనిపిస్తోందన్నారు.
గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంకంటే కేంద్రానికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అన్నారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేస్తే నష్టమేమిటని అడిగారు. కమిటీ వేస్తే మంత్రులు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్లు బయటకు వస్తాయనే అడ్డుకుంటున్నారన్నారు.