మళ్లీ కోవిడ్ గుసగుసలు.. పెరుగుతున్న కేసులు
కనుమరుగైపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి మెల్లగా కోరలు చాస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల కోవిడ్-19 కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదు కావడం ప్రజల్లో కాస్త టెన్షన్ను రేకెత్తిస్తోంది. గత కొన్ని వారాలుగా ఫ్లూ , జ్వరాల లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, పరీక్షలు చేయగా అందులో కోవిడ్ పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంటోందని ప్రముఖ వైద్యులు గుర్తించారు.
అయితే, ఈ ఇన్ఫెక్షన్ల తీవ్రత చాలా తేలికపాటిదిగా ఉండటంతో ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులలో స్వల్ప జ్వరం, గొంతు నొప్పి, పొడి దగ్గు, విపరీతమైన అలసట వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బాధితులకు ఔట్పేషెంట్ (OP) పద్ధతిలోనే మందులు ఇస్తూ ఇంటి వద్దే చికిత్స పొందేలా సిఫార్సు చేస్తున్నారు. గత కోవిడ్ వేవ్ల తరహాలో ఆసుపత్రుల్లో చేరడం గానీ, ఆక్సిజన్ అవసరం పడటం గానీ, తీవ్ర అస్వస్థతకు గురికావడం గానీ జరగడం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ఓమిక్రాన్ ఉప-వేరియంట్లే కారణమా?
ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తక్కువ తీవ్రతను కలిగి ఉన్న ఓమిక్రాన్ ఉప-వేరియంట్ల (Omicron Sub-variants) వల్లే ఈ కాలానుగుణ మార్పులు జరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. సాధారణ జలుబు లేదా సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుని నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు మూడు నాలుగు రోజులకు మించి కొనసాగితే కచ్చితంగా కోవిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కోవిడ్ అనేది పూర్తిగా అంతం కాలేదని, వాతావరణ మార్పులను బట్టి ఇది కాలానుగుణంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని వైద్యులు గుర్తు చేస్తున్నారు.
ఈ వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలి!
ఈ ఇన్ఫెక్షన్లు సాధారణ వ్యక్తులపై పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, , కిడ్నీ, గుండె, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు (High-risk groups) మాత్రం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్లు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం , లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం వంటి ప్రాథమిక కోవిడ్ నిబంధనలను మళ్లీ పాటించాలని ప్రజలను కోరారు.














Click it and Unblock the Notifications