జెసికి అహంకారం, మదం: టిడిపిని గెలిపించడంపై రఘువీరా
తనకు మంత్రి పదవి లేనందున, తను లేకుండా మరొకరు ఉండవద్దనే ఉద్దేశ్యంతో కాంగ్రెసును లక్ష్యంగా జెసి చేసుకున్నారన్నారు. గెలిస్తే మంత్రులు ఖాతాలోకి, ఓడిపోతే నా ఖాతాలో వేద్దామని మంత్రులు చూస్తున్నారని జెసి అన్నారని కానీ తాము ఎప్పుడూ అలా అనలేదన్నారు. 2009 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెసు తరఫున పోటీ చేసిన 14 మంది అభ్యర్థులు తమ ఓటమికి జెసి ప్రయత్నాలు చేస్తున్నారని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జెసి కాంగ్రెసులో విష పురుగు అన్నారు. వేణుగోపాల్ రెడ్డిని ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. మా మీద కోపంతో పాటిల్ను ఓడించవద్దని మంత్రులమంతా జెసికి ఎన్నికలకు ముందు అప్పీల్ చేశామని చెప్పారు.
జిల్లాలో 1994-2004 మధ్య టిడిపి అకృత్యాలను అడ్డుకున్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి ఒక్కరే అన్నారు. పార్టీ పాటిల్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థి లేడని అనడాని జెసి చెప్పడం అహంకారమా, మదమా అని ప్రశ్నించారు. గెలిచిన టిడిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మొదట కృతజ్ఞతలు తెలిపింది జెసికే అన్నారు. కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా పని చేసే జెసి కాంగ్రెస్ వ్యక్తా అన్నారు. ఇప్పటి వరకు సాటి కాంగ్రెస్ నేతగా జెసిపై ఓపిక పట్టామని కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించినందునే తప్పని పరిస్థితుల్లో మాట్లాడుతున్నామన్నారు. నీ నిజస్వరూపం ఏమిటన్నారు. ఏ లాభాపేక్షతో, దేనికి ఆశపడి టిడిపికి మద్దతు ఇస్తున్నారన్నారు.
కాంగ్రెసులో ఉండి కాంగ్రెసును ఓడించామని సంబరాలు చేసుకోవడం ఏమిటన్నారు. గెలిచిన ఘనత టిడిపిది కాదన్నారు. అలా అనికొని సంబరపడితే అంతకన్నా మూర్ఖులు ఉండరన్నారు. జెసి సహకరిస్తే కాంగ్రెస్ ఘన విజయం సాధించేదన్నారు. కాంగ్రెస్ కోసం చాలామంది చనిపోయారని జెసి తీరుతో వారి ఆత్మ క్షోభిస్తుందన్నారు. జెసి తీరును పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానన్నారు. జెసి బహిరంగంగా పార్టీ నేతను ఓడిస్తానని చెప్పాక పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి రాజకీయ సునామీలో కాంగ్రెసును బలహీనర్చేందుకు చూసే జెసిలాంటి వ్యక్తులు ఉండకూడదన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆయనపై చర్యలు తీసుకోకుంటే పార్టీ బలహీన పడుతుందన్నారు.