సత్య సాయిబాబా గురించి నిజాలు వెల్లడించడం లేదా?

సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన తెలిపారు. వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్గానే ఉన్నట్లు వెల్లడించారు. ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సత్య సాయిబాబాకు కిడ్నీకి సంబంధించిన వైద్యం జరుగుతోందని రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి చెప్పారు.
పుట్టపర్తి, ధర్మవరం గ్రామాల్లో నాలుగు వేల మంది పోలీసులను మోహరించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లోనూ 144వ సెక్షన్ విధించారు. పలువురు ప్రముఖులు పుట్టపర్తి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏర్పాట్లను, ప్రముఖుల తాకిడి వల్ల సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి నిజాలు దాస్తున్నారనే అనుమానాలను భక్తుల వ్యక్తం చేస్తున్నారు.