రాజీనామాకు వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు ఎంపి మేకపాటి రెడీ
''రెండు పడవల ప్రయాణం నాకు ఇష్టం లేదు. ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఏ క్షణమైనా రావొచ్చు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు రావొచ్చు"" అని ఆయన చెప్పారు. సోమవారం నెల్లూరు పట్టణంలో నిర్వహించిన 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" జెండా ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావొచ్చన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఇదే స్థానం నుంచి 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" తరఫున ప్రజల ముందుకు వస్తానన్నారు. రాష్ట్రం సరైన దారిలో నడిచి అభివృద్ధి జరగాలన్నా, మహానేత వైఎస్ఆర్ఆశయాలు నెరవేరాలన్నా, జగన్ నాయకత్వం ఎంతైనా అవసరమన్నారు. ఈ కారణంగానే తాను జగన్ వెంట నడుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
యువనేత బలపరచిన అభ్యర్థులు.. పార్టీ పుట్టీపుట్టకనే మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారని మేకపాటి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్కు పాల్పడినా ప్రజలు, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు జగన్కు మద్దతుగా నిలిచారన్నారు. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా యువనేత విజయాన్ని అడ్డుకోలేవన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ప్రభంజనం సృష్టిస్తారని, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఎంపీ మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 160 నుంచి 190 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.