వైయస్ జగన్ శిబిరంతోనూ కందుల బ్రదర్స్ మంతనాలు

కాంగ్రెసులో చేరే విషయాన్ని వాయిదా వేసి కందుల సోదరులు బుధవారం రాత్రి వైయస్ జగన్ వర్గం నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని, అయితే 2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కందుల సోదరులు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంగీకరించలేదని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసు నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు వారు నిర్ణయం తీసుకుని గురువారం మధ్యాహ్నం కాంగ్రెసులో చేరిపోయారు.
కాగా, ఇప్పటికీ కడప పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడానికి కందుల రాజమోహన్ రెడ్డి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి వినకపోతే కందుల శివానంద రెడ్డిని పోటీకి దించే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది. కందుల సోదరులు కాకపోతే తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేయాల్సి రావచ్చు. తమ కాంగ్రెసు కడప అభ్యర్థి రవీంద్రా రెడ్డేనని శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అంటున్నారు.


Click it and Unblock the Notifications