ఎన్టీఆర్ కుటుంబంతోనే ఉంటా, రాజీనామా చేశా: వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీకి నారా, నందమూరి కుటుంబ సభ్యులు రెండు కళ్లలాంటివారని ఆయన అన్నారు. తనకు చంద్రబాబుపై గౌరవం ఉందని, చంద్రబాబుపై తనకు అసంతృప్తి లేదని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నందమూరి కుటుంబ సభ్యులతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు. నందమూరి హరికృష్ణకు క్షమాపణ చెప్పాలని అడిగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వంశీ పార్టీ అర్బన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని ఉమా మహేశ్వర రావును కూడా అహ్వానించారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన తన రాజకీయ గురువు గద్దె రామ్మోహన్ రావుతో ఆయన మంతనాలు జరిపారు. తాను రాజీనామా చేశానని ఆయన ప్రకటించారు.
పార్టీ పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన అన్నారు. తన రాజీనామా వల్ల పార్టీకి ఏమీ కాదని ఆయన అన్నారు. ఉమా మహేశ్వర రావు మూడు పార్టీలను నడుపుతారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా ఆయన కుటుంబ సభ్యులే నడుపుతారని ఆయన అన్నారు. తన అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా తాను కొనసాగలేనని ఆయన అన్నారు. కేవలం దేవినేని ఉమా మహేశ్వర రావు వల్లనే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.