చిరంజీవి - వైయస్ జగన్ ఢీ : కడప ఉప ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్
తమిళనాడు ప్రచారం నుండి వచ్చిన చిరంజీవిని పార్టీ ఇప్పుడు కడప ఎన్నికల ప్రచారంలో ఆలస్యం చేయకుండా దించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. కడపలో చిరంజీవి పర్యటన షెడ్యూలను రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాజీనామా చేసి సెంటిమెంటుతో ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న జగన్ను ఎదుర్కొనడం కష్టమే. సెంటిమెంటు ఎన్నికలు జరగిన సందర్భాల్లో ప్రత్యర్థులు అభ్యర్థులను నిలబెట్టిన సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ.
జగన్ కూడా ఇలాంటి సెంటిమెంటుతో బరిలోకి దిగటం, ఆయన్ను ఎదుర్కొనడం ఇటు కాంగ్రెసుతో పాటు అటు టిడిపికి కూడా కష్టమే. అయినా వారు రంగంలోకి దిగి జగన్ను ఓడించడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చిరంజీవి ప్రచారం చేస్తే జగన్ సొంత జిల్లాలో ప్రజలు చిరు ప్రచారాన్ని ఎలా స్వాగతిస్తారో చూడాల్సి ఉంటుంది. గతంలో వైయస్ను తీవ్రంగా విమర్శించిన చిరంజీవి ఇప్పుడు తన ప్రచారంలో వైయస్ను పొగడాలి లేదా ఆయనపై మాట్లాడకుండా ఉండాలి. అది చిరుకు ఇరుకున పెట్టే విషయమే.
ఇలాంటి సమయంలో కడప ప్రజలు చిరు ప్రచారానికి స్పందించి కాంగ్రెసును గట్టిక్కిస్తారా లేక గతంలో వైయస్ను తెగిడిన చిరుతో ప్రచారం చేయించినందుకు ముంచేస్తారా ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందే. చిరంజీవి ప్రచారంలోకి దిగిన తర్వాత చిరు గ్లామర్కు, జగన్ సెంటిమెంటుకు మధ్య పోటీ ఉంటుంది. గెలుపు సెంటిమెంటుదా, గ్లామర్దా ఇక చూడాలి. కాంగ్రెసుకు చిరు ప్రచారం నష్టం కలిగిస్తుందా, లాభం కలిగిస్తుందా చూడాలి.