తెలుగుదేశంలో ముసలం: పురంధేశ్వరికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సహకారం?
హైదరాబాద్: తమ పార్టీలో సంక్షోభం సృష్టించడానికి కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరియే కుట్ర చేశారని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం ఇప్పటికీ గట్టిగా నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితులైన పార్టీ నాయకులు ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడడానికి కూడా వెనకాడడం లేదు. పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పురంధేశ్వరిపై తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పైగా, పురంధేశ్వరి తన ఏజెంట్ల ద్వారా తమ పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. విశాఖపట్నంలో, ఒంగోలులో, విజయవాడలో ఆమె మాట్లాడిన మాటలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.
పురంధేశ్వరి పురమాయింపు మేరకే నందమూరి హరికృష్ణ పార్టీలో చిచ్చు పెట్టడానికి పూనుకున్నారని అంటున్నారు. అందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సహకారం అందించారని చెబుతున్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నందమూరి హరికృష్ణకు మాత్రమే కాకుండా పురంధేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు కూడా అత్యంత సన్నిహితుడు. అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన వారి వెంట ఉన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు కార్యక్రమంలో పంచిన హరికృష్ణ లేఖ రాసింది యార్లగడ్డ లక్ష్మీప్రసాదేనని చెబుతున్నారు. యార్లగడ్డ మంచి రచయిత కూడా.