ఉప ఎన్నికలకు ముందే జగన్ క్యాంప్ శాసనసభ్యులపై వేటుకు రెడీ
జగన్ వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులుపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేస్తారని, ఆ ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఇందుకు సంబంధించి రంగమంతా సిద్ధమైనట్లు చెబుతున్నారు.
కాగా, జగన్ వెంట వెళ్తున్న తమ పార్టీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మనోహర్ను కోరింది. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటు వేసిన పోచారం శ్రీనివాస రెడ్డిపై కూడా వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రసన్నకుమార్ రెడ్డిపై, బాలనాగిరెడ్డిపై వేటు వేయడానికి కూడా రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే, పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏం చేయాలనే యోచనలో నాదెండ్ల మనోహర్ ఉన్నట్లు తెలుస్తోంది.