తప్పుడు సంకేతాలతో చంద్రబాబు ఇమేజ్ను డామేజ్ చేస్తున్న కోటరీ?
ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితర బాబు కోటరీ విభాగమే చంద్రబాబు ఇమేజ్ డామేజ్ కావడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టిడిపిని వారి వారి వ్యాపారాల అభివృద్ధి కోణంలో పయనింప జేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హరికృష్ణ - చంద్రబాబునాయుడు మధ్య చోటు చేసుకున్న విభేదాలు కూడా అందులో భాగమేనని పలువురు భావిస్తున్నారు. కోటరీ విభాగం హరికృష్ణను బాబుకు దూరం చేయాలనే వ్యూహంతో కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజయవాడ కేంద్రంగా నందమూరి - నారాల మధ్య విభేదాలు అనే వార్తలు పతాక శీర్షికకు ఎక్కిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి హరికృష్ణ స్వయంగా వెళ్లారు.
అలాంటి విషయాన్ని నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు లేవని చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. చంద్రబాబుకు పార్టీ పరంగా తప్పుడు రిపోర్టులు అందిస్తూ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి.