వైయస్ వివేకాను చూసి ముఖం తిప్పుకున్న వైయస్ జగన్ భార్య భారతి
కడప లోక్సభ స్థానానికి వైఎస్ జగన్మోహనరెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయమ్మ వైఎస్సార్ పార్టీ తరఫున పోటీలో ఉండగా పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి నిలబడ్డారు. ప్రచారంలో తీవ్రస్థాయి విమర్శలు చేసుకోకున్నా పోలింగ్లో మాత్రం వీరి మధ్య విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి కడప పట్టణంలోని భాకరాపురం మహిళాబూత్ను పరిశీలించేందుకు వెళ్లి అక్కడ క్యూలో ఉన్న ఓటర్లకు నమస్కారం చేస్తూ సాగారు.
అయితే ఓటు వేసేందుకు అప్పటికే క్యూలో నిలుచున్న జగన్ సతీమణి భారతి తల తిప్పుకోగా, సోదరి షర్మిల బాబాయిని చూసి మొఖంపై చున్నీ కప్పుకొన్నారు. ఇక అదే పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్ పార్టీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఓటు వేసేందుకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ ఏజెంటుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ కూర్చున్నారు. ఆమె విజయమ్మను చూసీ చూడనట్లుగా తల దించుకున్నారు. ఇలా సొంత కుటుంబ సభ్యు లు ఎదురుపడినా ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం క్యూలో ఉన్న ఓటర్లలో ఆసక్తిని రేకెత్తించింది.