చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం పోయింది, కాపాడుకోవాలి: నాగం జనార్దన్ రెడ్డి
పార్టీ 2008లో ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసిందని, ఆ కాపీనే కేంద్ర హోంమంత్రికి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సీమాంధ్ర నాయకులే పార్టీ విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని, వారిపై చర్య తీసుకోకుండా తనపై ఎలా తీసుకుంటారని నిలదీశారు. పార్టీపై ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం పోయిందని, చంద్రబాబునాయుడు తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆనాడు దేవేందర్గౌడ్ పార్టీ నుంచి వెళ్తే ఏమైందో ఇప్పుడు కూడా అదే అవుతుందంటూ కొందరు నాయకులు మాట్లాడడం సరికాదని, దేవేందర్గౌడ్ వెళ్లినపుడు ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడు వేరని నాగం వివరించారు. దేవేందర్గౌడ్ తన పార్టీని ఇప్పటికీ అలాగే ఉంచి ఉంటే తెలుగుదేశం నుంచి వెళ్తున్నవారు అందులోకే వెళ్లేవారని చెప్పారు. కేసీఆర్ కూడా పార్టీ నుంచి వెళ్లేనాటికి ఒక్కరే అని, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఆయనే కారణమయ్యారని చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయడానికి పార్టీలే అవసరం లేదన్నారు.