చంద్రబాబుపై కార్యకర్తలు తిరగబడతారు: నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరిక
ప్రణబ్ కమిటీకి కాలం చెల్లినందున చిదంబరానికి మరో లేఖ ఇవ్వాలని ఆయన టిడిపిని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ వద్దకు వెళ్లినప్పుడు పార్టీ నుండి లేఖను తీసుకు రమ్మని చెప్పారని గుర్తు చేశారు. సీమాంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. టిడిపి తెలంగాణ ఫోరం సీమాంధ్రుల కనుసన్నుల్లో మెదులుతున్నారన్నారు. తాను జగన్తో వెళుతున్నానని, టిఆర్ఎస్లో చేరుతున్నానని, బిజెపిలో చేరుతున్నానని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో ఐదేళ్లు పోరాడానని అలాంటిది తాను జగన్తో ఎలా కలుస్తానని ప్రశ్నించారు. పార్టీలు మార్చే వారు తనపై విమర్శలు చేస్తారా అని దేవేందర్ గౌడ్ను ఉద్దేశించి అన్నారు. తాను ఎవరితోనూ లాలూచీ పడలేదన్నారు. తనకు పిఏసి చైర్మన్గా పదవి దూరమైన తర్వాతే పోరాటం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఖండించారు. చంద్రబాబుకు నేను ముందునుండి అండగానే ఉన్నానని అన్నారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా భరించానని అన్నారు. ఇప్పటికీ తాను పార్టీ ముసాయిదా ప్రకారమే తెలంగాణ కోసం పోరాడుతున్నానన్నారు. తెలంగాణ టిడిపి నేతలు అనవసరంగా తెలంగాణ ప్రజల ఆవేశానికి గురి కావద్దని సూచించారు. మహానాడులో తెలంగాణ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమిటి, విద్యార్థులు ఎందుకు బలిదానాలు చేసుకుంటున్నారో చర్చించాలని సూచించారు.
తెలంగాణకు అందరం కలిసి చంద్రబాబును ఒప్పిద్దామని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని అన్నారు. మా పార్టీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసును చీల్చి చెండాడుతానని అన్నారు. మా పార్టీ వైఖరే సరిగా లేనప్పుడు ఇతర పార్టీలను ఎలా ప్రశ్నిస్తామని అన్నారు. టిడిపి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. టిడిపి తెలంగాణ తీర్మానానికి అనుగుణంగానే తాను ఉద్యమిస్తున్నానని తీర్మానం వెనక్కి తీసుకుంటానని పార్టీ చెబితే తన నిర్ణయం తాను ఒక్క క్షణంలో తీర్చుకుంటానని అన్నారు. తనను పార్టీ నుండి బహిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే కుట్ర జరిగిందన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోవాలన్నదే మా ఆదర్శం కానీ కెసిఆర్ కానీ మరెవరో తమకు ఆదర్శం కాదన్నారు. చిదంబరానికి చంద్రబాబు లేఖ రాస్తే టిడిపి జెండాను, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని జై తెలంగాణ అంటూ ప్రజలలోకి వెళతామని అన్నారు.