చిరంజీవిని ఊరిస్తున్న కాంగ్రెసు అధిష్టానం, ఢిల్లీకి పిలిచిన ఆజాద్
విలీన ప్రక్రియను ఎన్నికల సంఘం ఆమోదించిన వెంటనే సాంకేతిక ప్రక్రియ పూర్తవుతుంది. ముందుగా ప్రజారాజ్యం చెప్పినట్లుగా కోస్తా జిల్లాల్లో భారీ స్థాయి విలీన సభ జరపాలన్న ప్రతిపాదన రద్త్దెంది. భారీ సభ నిర్వహణపై కాంగ్రెస్ అంతగా సుముఖంగా లేకపోవడంతో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో చిరంజీవి లాంఛనంగా పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఆ తర్వాత హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమక్షంలో చిరంజీవి గాంధీభవన్లోకి అడుగుపెడతారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో డీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసే విలీన కార్యక్రమంలో ప్రరాపా శ్రేణులు కాంగ్రెస్లో చేరతాయి. వచ్చే నెల రెండోవారం నాటికి ఈ ప్రక్రియంతా పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
సోనియా సమక్షంలో చిరంజీవి పార్టీలో చేరికతోసహా మిగిలిన కార్యక్రమాలకు సంబంధించిన తేదీలు చిరంజీవి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఖరారవుతాయని కాంగ్రెస్ వర్గాల కథనం. ఆజాద్, అహ్మద్ పటేల్తోపాటు సోనియాతోనూ చిరంజీవి భేటీ అయ్యే అవకాశముంది. పార్టీలో, ప్రభుత్వంలో చిరంజీవికి ఎలాంటి హోదా, పదవి ఇవ్వాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని అంటున్నారు. పార్టీ పదవి కన్నా కేంద్ర మంత్రివర్గంలో చేరడంపైనే చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహితవర్గాల సమాచారం.
శాసన మండలిలో గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఐదింటిలో ఒక దానిని చిరంజీవి సూచన మేరకు భర్తీచేసే అవకాశముందని భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమూ చర్చకొచ్చే అవకాశముంది. ఎమ్మెల్సీ స్థానం కోసం ఆ పార్టీలో సీనియరు నేతలు పలువురు పోటీ పడుతున్నారు.