వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి తెర మీదికి కెవిపి, రోశయ్య మద్దతు
రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాయడం, మంగళవారం సోనియాను కలిసి పరిస్థితి వివరించడం ఇందులో భాగమేనని అంటున్నారు. కెవిపి ప్రాధాన్యం గురించి రోశయ్య సోనియా గాంధీకి వివరించినట్లు చెబుతున్నారు. పార్టీ శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభావాన్ని తగ్గించాలంటే అది కెవిపి రామచందర్ రావు వల్లనే అవుతుందని రోశయ్య సోనియాకు చెప్పినట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పనితీరు మెరుగుపడాలంటే కెవిపికి క్రియాశీలక పాత్ర ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
రోశయ్య ఢిల్లీలో సోనియా గాంధీని కలవడానికి ముందు, కలిసిన తర్వాత కెవిపి రామచందర్ రావు రోశయ్యతో మంతనాలు జరిపారు. దీన్నిబట్టి వారిద్దరు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కథ నడుపుతున్నట్లు భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కెవిపి రామచందర్ రావు పాత్ర తగ్గింది. ప్రభుత్వ సలహాదారు పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కెవిపి రామచందర్ రావును ఏ స్థానంలో పెట్టాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అత్యంత కీలకమైన పరిణామంగా చెబుతున్నారు.