జగన్, బాబులపై కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు, పగటి కలలంటూ విమర్శ
2014 ఎన్నికల్లో సైతం కార్యకర్తల అండతో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ టికెట్టుపై గెలిచిన ఎమ్మెల్యేలందరూ పార్టీ విధానాల మేరకు నడుచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రెండుమార్లు అధికారంలోకి వచ్చినప్పుడూ సీఎం అభ్యర్థి ఎంపిక విషయాన్ని ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వదిలేశారని తెలిపారు. ఆమె ఎంపిక చేసిన తరువాతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజాభీష్టం మేరకు వైఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఎప్పుడూ కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టడంగానీ, వ్యతిరేకంగా మాట్లాడడంగానీ చేయలేదన్నారు.
2009 ఎన్నికల అనంతరం కూడా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారని గుర్తు చేశారు. ఓసారి తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి తీవ్రంగా నష్టపోయిన్నట్టు వైఎస్ వెల్లడించారని, ఈ అంశం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. కానీ జగన్ ధిక్కార విధానం వైఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆయన వ్యవహారం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, కార్యకర్తల సమష్టి కృషితో అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ బతికుంటే జగన్ వ్యవహారాన్ని చూసి బాధపడేవారన్నారు.