జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, అవిశ్వాసం నెగ్గడానికి ప్లాన్
వైయస్ జగన్ వైపు వెళ్తున్నవారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ముప్పు వస్తుందనే ఉద్దేశంతో అనర్హత వేటు ద్వారా జగన్ వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను అవిశ్వాస తీర్మానానికి దూరం చేయాలనేది ఆ వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటికే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై తెలుగుదేశం పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. జగన్ వెంట వెళ్తున్న దాదాపు 15 మంది శాసనసభ్యులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి వారిపై అనర్హత వేటు పడేలా చూడబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం శానససభలో చర్చకు వచ్చేలోగా ఈ పని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, స్పీకర్ ఎన్నికకు సహకరించడం ద్వారా తాము పార్టీ వెంట ఉన్నట్లు ప్రదర్శించుకుని అవిశ్వాస తీర్మానంపై ప్రధాన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ వర్గం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగే సమయానికి దాదాపు 40 మంది కాంగ్రెసు శాసనసభ్యులను కూడగట్టాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంట కచ్చితంగా 25 మంది శానససభ్యులున్నారు. మరో పది మంది దాకా మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో తమ సత్తా ఏమిటో చూపాలని వారు అనుకుంటున్నారు. దీన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెసు నాయకత్వం అనర్హత వేటు వేసి సభా బలాన్ని తగ్గించి గట్టెక్కాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.