సోనియా మనోగతం వెల్లడి, తెలంగాణకు వ్యతిరేకమే
తెలంగాణ రాష్ట్ర సమస్య కాదని, దేశ సమస్య అంటూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను ఆయన ముందు పెట్టారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావు వంటి సీమాంధ్ర నాయకులు ఇదే వాదనను ముందు పెడుతున్నారు. అంతేకాకుండా, మూడు ప్రాంతాల ప్రజల, నాయకుల అభిప్రాయం కూడా కావాలని ఆజాద్ అన్నారు. ఇప్పటికే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాన్ని సేకరించిందనే విషయాన్ని ఆయన పక్కన పెట్టారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని అంటూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల సెంటిమెంటును కూడా గౌరవిస్తామని చెప్పారు. ఇది కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పినట్లే.
అయితే, కాంగ్రెసు అధిష్టానానికి పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను దారికి తెచ్చుకోలమనే ధీమా ఉందని భావించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డెడ్లైన్లు విధిస్తూ వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. ఈసారి కూడా వారు అదే విధంగా రాజీనామాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తూ ఉండవచ్చు. తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెసు తమ ప్రాంత రాజకీయ నాయకులపై నమ్మకం లేదు. రాజీనామాలు చేస్తామని ప్రకటించినప్పటికీ దానికి ఎంత మంది కట్టుబడి ఉంటారనేది కూడా అనుమానమే. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయరనే నమ్మకంతోనే తాము కూడా రాజీనామా చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రకటించి ఉంటారని కూడా అనుకుంటున్నారు.