సోమవారమే ప్రజాప్రతినిధుల రాజీనామా: టి-కాంగ్రెసు
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తాము పదవులు వదులు కోవడం లేదని కొందరు ఆరోపణలు చేశారని అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఉండటం కోసమే ఇన్నాళ్లూ ఓపిక పట్టామని చెప్పారు. కేంద్రం ఇప్పటికీ స్పందించక పోవడంతో తాము చేసేది లేక రాజీనామాలకు సిద్ధపడ్డామని అన్నారు. తమ రాజీనామాలతో తమపై ఆరోపణలు చేసిన వారి ఉద్దేశ్యం పటాపంచలు చేశామని అన్నారు. రాజీనామాకు కట్టుబడి మా మాటను మేం నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఆస్తులు, ప్రాణాలు నష్టం కాకుండా తాము ఇన్నాళ్లూ ఉద్యమించామని చెప్పారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. పదవుల కోసం తాము సాకులు చెప్పడం లేదన్నారు. తెలంగణ కోసం పదవులు త్యాగం చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు.
రాజీనామాలకు సిద్ధపడ్డ తర్వాత వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కె కేశవరావు అన్నారు. తాము నేరుగా సభాపతులకే రాజీనామాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజీనామాలు అయినా ఆమోదించాలి. లేదా తెలంగాణ అయినా ప్రకటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ కోసం టి-కాంగ్రెసు నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. పదవుల కోసం తాము ఎప్పుడూ లాలూచీ పడలేదన్నారు. మా పార్టీ నేతల నుండి ఈ స్పందన వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. తాము ఢిల్లీలో రాజీనామా సమర్పిస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.