తెలంగాణ ఇవ్వాల్సిందే: ప్రధానితో జైపాల్ రెడ్డి

తెలంగాణ సమస్య పరిష్కారమేమిటో తన కచ్చితమైన అభిప్రాయాలను తాను ప్రధానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాదులో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై తన భావనలను, అంచనాలను ప్రధానికి వివరించినట్లు ఆయన చెప్పారు. ఆయన శుక్రవారంనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసి 40 నిమిషాల పాటు మాట్లాడారు. తనంత తానుగానే ప్రధాని వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో తాను చెప్పానని ఆయన అన్నారు. అయితే, ప్రధానికి తాను చెప్పిన విషయాలను బయటకు వెల్లడించలేనని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రిగా, పార్టీ సీనియర్ నేతగా సమస్య పరిష్కారానికి తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన అన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలని, జాప్యం చేయడం సరి కాదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నిర్ణయం తీసుకోలేరని, కాంగ్రెసు నాయకత్వం, యుపిఎ పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలకు తాను ఇచ్చే సందేశం ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెసు నాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. రాష్టంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే అంశంపై తాను ప్రధానితో మాట్లాడలేదని ఆయన చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వైఖరేమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. మిగతా విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. 14ఎఫ్ తీర్మానం తొలగింపుపై శాసనసభ తీర్మానాన్ని గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications