జగన్కు షాక్, ఆస్తులపై ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశం
జగన్ ఆస్తులు అక్రమ ఆర్జనంటూ మంత్రి శంకరరావు రాసిన లేఖను హైకోర్టు తనంత తానుగా విచారణకు స్వీకరించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కడప జిల్లాకు చెందిన న్యాయవాది షేర్వాణీ ఇంప్లీడ్ అయ్యారు. జగన్ ఆస్తులపై సి.బి.ఐ. విచారణకు ఆదేశిస్తామని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుగానే సోమవారం సూచనప్రాయంగా వెల్లడించారు. పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఆస్తులు కూడగట్టినట్టు, నష్టాలు చూపిస్తున్నా జగన్ కంపెనీలలోకి పెక్కుమంది నుంచి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చి పడడానికి అదే కారణం అని పిటిషన్లలో అన్నారు.
సిబిఐ విచారణను వ్యతిరేకించిన జగన్ తరపు న్యాయవాదులు ఈ విచారణ వల్ల సందూర్ పవర్, జగతి పబ్లికేషన్స్, భారత సిమెంట్స్ వంటి కంపెనీలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని, స్టాక్ మార్కెట్పై దీని ప్రభావం ఉండవచ్చునని వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు త్రోసిపుచ్చింది. పిటిషన్ వేసిన శంకరరావు మంత్రి కాబట్టి జగన్ కంపెనీలు ఏమైనా ఉల్లంఘించినట్టు భావిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చుగాని, మంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ వ్యక్గిగా హై కోర్టుకు లేఖ రాశారని వారు వాదన వినిపించారు. ఆయన పిటిషన్ వేయడంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా రాజకీయ దురుద్దేశంతో పిటిషన్లు దాఖలు చేశారని వారు వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు త్రోసిపుచ్చుతూ సిబిఐ విచారణ జరిపితే తప్పేమిటని ప్రశ్నించింది.