అది కెసిఆర్కు మాత్రమే తెలిసిన రహస్యమా!
కెసిఆర్ సంఘీభావం తెలిపిన అదే కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కె కేశవరావు సైతం ఉన్నారు. కాంగ్రెసు పార్టీలోని అలాంటి సీనియర్ నాయకులకు తెలంగాణపై రహస్యం చెప్పకుండా కేవలం టిఆర్ఎస్ ఛీఫ్కు అధిష్టానం చెప్పిందా. తమ పార్టీ నేతలను విస్మరించి కెసిఆర్కు ప్రాధాన్యం ఇచ్చిందా. కెసిఆర్ ఓ వ్యూహంతోనే కాంగ్రెసు దీక్షలలో పాల్గొని అదిగో తెలంగాణ అంటున్నారని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం నుండి ఎలాంటి సంకేతాలు అందనప్పటికీ కేంద్రం తెలంగాణ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్న ఈ సమయంలో ఎలాగూ ఓ నిర్ణయం వెలువడక తప్పదన్న ఉద్దేశ్యంతోనే కెసిఆర్ వ్యూహాత్మకంగా ఆ వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ తెలంగాణ ప్రకటించాలనుకుంటే అధిష్టానం స్టేట్మెంట్ ఇవ్వడమో లేదా తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేతలకు చెప్పి ప్రకటన చేయించడమో చేసేదని కానీ కెసిఆర్ సంకేతాలు లేకున్నప్పటికీ కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశారని పలువురు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. అయితే కెసిఆర్ కాంగ్రెసులోకి వస్తే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ నష్టమేమీ లేదని, కానీ తన పార్టీని విలీనం చేయకుంటే మాత్రం ఆ వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. అంతేకాదు కెసిఆర్ 2009 తర్వాత ఎప్పుడూ కాంగ్రెసు అధిష్టానాన్ని విమర్శించలేదు. కేవలం ఇక్కడి నేతలనే విమర్శించడం విశేషం.