ఏకాభిప్రాయానికి కిరణ్, బొత్స సంప్రదింపులు

తమ పార్టీలో ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని, ఇతర పార్టీలతో తమకు సంబంధం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తెలుగుదేశం పార్టీ విషయాన్ని వదిలేయవచ్చునని అనుకుంటున్నారు. నిజానికి, చంద్రబాబు అడ్డం తిరగడం వల్లనే వచ్చిన తెలంగాణ రాకుండా పోయిందని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా తమ పార్టీ అధిష్టానం వైపే వేలేత్తి చూపుతున్నారు. దీంతో చంద్రబాబుకు కాస్తా ఊరట లభించింది.
తమ పార్టీ తెలంగాణ నాయకులే రాజీనామాలు చేసి, తమపైనే తిరుగుబాటుకు సిద్ధపడడంతో కాంగ్రెసు అధిష్టానం దిగిరాక తప్పలేదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు తమ తమ పట్టు వీడడం లేదు. అయితే, ఏదో ఒక చోట ఇరు ప్రాంతాల నాయకులకు మధ్య సయోధ్య కుదిరించి, సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులతో బొత్స సత్యనారాయణ చర్చలను పూర్తి చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇక, సీమాంధ్ర నాయకులతో ఆయన చర్చలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications