వన్నె తగ్గుతున్న భారతదేశపు గ్రామీణ పల్లెలు...
శుక్రవారం హోం శాఖ కార్యదర్శి రాజ్ కుమార్ సింగ్, జాతీయ జనన గణన కమిషనర్ సి.చంద్రమౌళి దేశ పట్టణ, గ్రామీణ జనాభా లెక్కలను విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం గత పదేళ్లలో దేశ జనాబా సగటను 18.1 శాతం పెరగగా.. ఇందులో గ్రామాల వాటా 9 శాతం.. పట్టణాల వాటా 9.1శాతంగా నమోదైంది. 1991 -2001 మధ్య పదేళ్లలో దేశ జనాభా సంఖ్య 21.5 కోట్లు పెరిగితే 2001-2011 మధ్య పదేళ్లలో 17.6 కోట్లు మాత్రమే పెరిగింది. అంటే వృద్థిరేటు 3.9 శాతం తగ్గింది.
ఈ కాలంలో .. గ్రామీణ జనాభా వృద్థి 5.9 శాతానికి తగ్గగా , పట్టణ జనాభా వృద్థి 0.3 శాతం పెరిగింది. దీన్ని బట్టి మన పల్లెలు ఎంతగా కుచించుకుపోతున్నాయో, అదే సమయంలో పట్టణాలు ఎంత జనసమర్థంగా మారిపోతున్నాయో అర్థమవుతుంది. పల్లె జనాభా తగ్గి... పట్టణ జనాభా సంఖ్య పెరగటానికి పట్టణ సహజ వృద్థితో పాటు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా పెరగటం, నగర శివార్లలోని గ్రామాలు పట్టణ రూపు సంతరించుకోవటం ముఖ్య కారణాలుగా తాజా గణాంకాలు విశ్లేషిస్తున్నాయి. పట్ణణ ప్రాంతాల్లో కంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు గ్రామాల్లోనే సమర్ధవంతగా అమలవుతుండటం కూడా పల్లె జనాభా తగ్గటానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 72.19శాతం నమోదు కాగా, పట్టణ జనాభా 27.81నమోదైంది. 2011 జనాభా గణాంకాల ప్రకారం గ్రామీణ జనాభా 68.84శాతం నమోదు కాగా, పట్టణ జనాభా 31.16శాతంగా నమోదైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశమ మొత్తం జనాభా 121,01,93,422, అందులో గ్రామీణులు 83,30,87,662, పట్టణవాసులు 37,71,05,760. మన రాష్ట్రంలో పట్టణ జనాభా ఉదృతి అనూహ్యంగా పెరిపోతుంది. జాతీయ సగటు ప్రకారం గత పదేళ్లలో రాష్ట్ర జనాభా 11.10శాతం పెరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల కేవలం 1.64 శాతం వృద్థి మాత్రమే కాగా.. పట్టణాల్లో ఇది 36.26 శాతంగా నమోదైంది. 2001 లెక్కల ప్రకారం పట్టణాల్లో 27.30 శాతం మంది నివశిస్తుండగా 2011 నాటికి ఆ శాతం 33.49కి చేరుకుంది.
మన రాష్ట్రంలో మొత్తం జనాభా 8,46,65,533, అందులో గ్రామీణులు 5,63,11,788, పట్టణ వాసులు 2,83,53,745 గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (దేశ జనాభాలో 18.6శాతం), బీహార్ (దేశ జనాభాలో 11.1శాతం), పశ్చిమ బెంగాల్ (దేశ జనాభాలో 7.5శాతం)తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 0.1 శాతం గ్రామీణ జనాభాతో సిక్కిం, మిజోరాం, గోవాలు చివరి మూడు స్థానాలను ఆక్రమించాయి. కేరళలలో గ్రామీణ జనాభా సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత పదేళ్లలో కేరళలో గ్రామీణ జనాభా సంఖ్య 26 శాతం తగ్గిపోయింది. దేశంలోనే ఇది రికార్డు. పట్టణీకరణలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.