సిబిఐ విచారణకు వైయస్ జగన్ అభ్యంతరాలేమిటి?
అసలు సిబిఐ ప్రాథమిక విచారణను జగన్ ఏ కారణాలతో వ్యతిరేకిస్తున్నారనేది ప్రశ్న. వాటిని ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వివరించారు. ప్రస్తుత మంత్రి శంకరరావు పిటిషన్ విచారణకు అర్హమైందా, కాదా అనే విషయం తేలకుండానే ప్రాథమిక విచారణ జరపడం సరైంది కాదని జగన్ తరఫు ప్రతినిధి అభిప్రాయపడ్డారు. హైకోర్టు తన పరిధిని దాటిందని కూడా ఆక్షేపించారు. తనను, తన కుటుంబ సభ్యులు ఈ స్థాయిలో విచారించడం తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు తన పరుపుప్రతిష్టలకు, కంపెనీ ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. తాను ఓదార్పు యాత్రను చేపట్టడంతో కాంగ్రెసు అధిష్టానంతో తన సంబంధాలు క్షీణించాయని, తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత శంకరరావు లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుందని ఆయన అన్నారు. తనపై కోర్టుకు లేఖ రాసినందుకు శంకరరావుకు మంత్రి పదవి దక్కిందని అన్నారు.
జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పీవీపీ వెంచర్స్, నవభారత్, కార్మెల్ ఆసియా తదితర సంస్థల ప్రతినిధులు సోమవారం సుల్తాన్బజార్లోని సీబీఐ కార్యాలయంలో హజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన గడువుకు సరిపోయే విధంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర సంస్థలపై మాత్రమే విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే.. జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి సోమవారం సాయంత్రం సీబీఐ కార్యాలయానికి హజరై ఇందిరా టెలివిజన్, కార్మెల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన పలు పత్రాలను అందచేశారు. మరోవైపు.. పీవీపీ వెంచర్స్ ప్రతినిధులు తమకు చెందిన ఐదు కంపెనీల వివరాలను అందజేశారు. అనంతరం హెటిరో గ్రూప్ కంపెనీల ప్రతినిధి సీబీఐ కోరిన డాక్యుమెంట్లు అందజేశామని తెలిపారు.