సమావేశాలకు వెళ్లేది లేదు: టి-కాంగ్రెసు ఎంపీలు
తాము చిత్తశుద్దితో రాజీనామాలు చేశామన్నారు. తాము రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాలపై స్పీకర్ మీరా కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడితే రాజీనామాల ఉపసంహరణలపై ఆలోచిస్తామనే లేదంటే వాటిపై ఆలోచించమన్నారు. రాజీనామాలపై రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఒకవేళ కేంద్రం నుండి అనుకూల ప్రకటన రాకున్నా తాము రాజీనామాలు ఉపసంహరించుకుంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు.
స్పీకర్ నుండి తమకు పిలుపు రాలేదన్నారు. రాజీనామాలు తిరస్కరిస్తే తెలంగాణ కోసం ఉద్యమిస్తామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ భేటీలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె కేశవ రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.