వైయస్ మరణంతో ప్రగతి ఆగింది!: ప్రపంచ బ్యాంకు
నివేదికలోని ముఖ్యాంశాలు గనుక చూసినట్లైతే వైయస్ హయాంలో ప్రైవేటు రంగంలో గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మంచి అభివృద్ధి సాధించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 20.15 లక్షల యువతకు 2006-07, 2008-09 మధ్య కాలంలో వివిధ రంగాల్లో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చారు. ఇందులో 1.75 లక్షల మంది యువతకు వంద ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన మరణం తర్వాత యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పన కార్యక్రమం గణనీయంగా తగ్గిపోయింది.
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల కొనుగోళ్ల వ్యహారాల్లో అక్రమాలు, అవినీతిని నివారించేందుకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బిల్లును తీసుకువచ్చేందుకు వైయస్ అంగీకరించారు. ఆయన హయాంలోనే ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. ఆయన అనంతరం గతేడాది అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా.. ఆమోదించలేదు. వైయస్సార్ అకాల మృతితో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమం నేపథ్యంలో ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించలేని పరిస్థితిలో ప్రభుత్వముంది. ఈ బిల్లును ఆమోదించడం ప్రభుత్వానికి పెద్ద సవాలే.