జగన్ సాక్షి డైలీ కథనానికి రామోజీ రావు కౌంటర్
పెద్ద కాదు గద్ద శీర్షికతో వ్కరమార్గంలో 431 ఎకరాలు మింగిన రామోజీ అంటూ సాక్షి పత్రిక ఈ నెల 1వ తేదీన పూర్తి పేజీలోని పచ్చి అబద్ధాల్ని నిర్లజ్జగా వండి వార్చిందని ఆయన వ్యాఖ్యానించారు. శంషాబాద్ సమీపంలో మార్గదర్శి చిట్ఫండ్స్ లిమిటెడ్కు, తన వాళ్లకు భూమి ఉన్న మాట నిజమేనని, అయితే ఆ తప్పుల కుప్ప ప్రకటించినట్లు 431 ఎకరాలు కాదని, తసుమార్ 319 ఎకరాలు మాత్రమేనని ఆయన అన్నారు. ఆ ఆషాఢభూతి గుండెలు బాదుకున్నట్లు వాటిని కొనుగోలు చేసింది రైతుల నుంచి కాదని, ప్రముఖ స్థిరాస్తి సంస్థ మై హోం గ్రూపు, తత్సంబంధీకుల నుంచి అని ఆయన వివరణ ఇచ్చారు. సుమారు నలబై ఐదేళ్ల వ్యవధిలో రెండు చేతులు మారాక ఆ భూమిని తమవాళ్లు కొన్నారని, ఆ భూములన్నీ చట్టబద్దంగా ఉన్నాయని ఖరారు చేసుకున్న తర్వాతనే తమ వాళ్లు కొన్నారని ఆయన అన్నారు. తాము ఎలా చట్టబద్ద భూములు కొన్నామనే విషయంపై రామోజీ రావు మరింత వివరణ ఇచ్చారు.
అదే సమయంలో మై హోం సంస్థ ఎండి జూపల్లి రామేశ్వర రావు ప్రకటన కూడా ఈనాడు దినపత్రికలో బుధవారం అచ్చయింది. ఆ భూములు రామోజీ రావుకు అమ్మింది తామేనని ఆయన చెప్పారు. అందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములు లేవని ఆయన స్పష్టం చేశారు. సక్రమ వ్యవహారంపై బురద చల్లుడు తగదని ఆయన సాక్షి దినపత్రికకు సలహా ఇచ్చారు.