యడ్యూరప్ప అభ్యర్థి సదానంద గౌడ కొత్త ముఖ్యమంత్రి
అంతకు ముందు ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరువర్గాలు పట్టుబడడంతో బిజెఎల్పి నేత ఎన్నిక కోసం రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది. ఇరు వర్గాలు బస్సుల్లో ఓటింగ్ కోసం వచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులు మూడు బస్సుల్లో 67 మంది ఓటింగ్ కోసం వచ్చారు. అనంత కుమార్ కూడా తన వర్గీయులను కూడా బస్సుల్లోనే చేరవేశారు. ఓటింగ్ జరుగుతున్నంత సేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండున్నర గంటల ప్రాంతంలో రహస్య ఓటింగ్ ముగిసింది.
అంతకు ముందు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న లోకసభ సభ్యుడు డివి సందానంద గౌడ, మంత్రి జగదీష్ షెట్టర్ వర్గాల శాసనసభ్యుల భేటీ ఓ హోటల్లో జరిగింది. సమావేశంలో ఇరు వర్గాలు పరస్పర నినాదాలు చేశాయి. పరస్పర వాదనలతో గందరగోళం నెలకొన్న స్థితిలో బిజెపి కేంద్ర పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రహస్య బ్యాలెట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రహస్య బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం కాగానే పార్లమెంటు సభ్యులను, ఎమ్మెల్సీలను బయటకు వెళ్లాలని ఆదేశించారు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సదానంద గౌడకు మద్దతు ఇస్తుండగా, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప, అనంతకుమార్ జగదీష్ షెట్టర్ను బలపరుస్తున్నారు. 225 మంది సభ్యుల శానససభలో బిజెపి సభ్యులు 120 మంది ఉన్నారు.