దిగొచ్చిన కేంద్రం, 14ఎఫ్ తొలగింపునకు సిఫార్సు
గతంలో చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని 14ఎఫ్ను తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో ఫోనులో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్ను తొలగింపజేసే బాధ్యత తనదని, ఎస్సై రాత పరీక్షలు యథావిధిగా జరగనివ్వాలని ముఖ్యమంత్రి తెలంగాణవాదులతో అన్నారు. అయితే, దాన్ని తొలగించే వరకు తాము శాంతించేది లేదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడినప్పటికీ రేపటి తెలంగాణ బంద్ను వాయిదా వేసుకునే ప్రసక్తి లేదని ఒయు జెఎసి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఒయు జెఎసి నాయకులు చెప్పారు. ఒక్కసారి నమ్మి మోసపోయాం కాబట్టి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువరించే వరకు వెనక్కి తగ్గబోమని, రేపటి బంద్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు.