జగన్పై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలుస్తుంది: విహెచ్
ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తే నిలవదని జగన్ ఆస్తులపై తీర్పు వల్ల తెలిసిందన్నారు. ఇది ప్రజా తీర్పు అని అన్నారు. ఇక నుండి ఎవరూ అవినీతికి పాల్పడకుండా సిబిఐ ఇలాగే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎవరు తవ్విన గోతిలో వారే పడతారనడానికి జగన్ ఆస్తుల వ్యవహారమే నిదర్శనమన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారికి జగన్ కేసు ఓ హెచ్చరిక అన్నారు. హైకోర్టు తీర్పుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అని అన్నారు. మొదట నాయకులపై, ఆ తర్వాత పార్టీ అధిష్టానంపై కక్ష సాధింపు అన్న జగన్ ఇప్పుడు కోర్టును కక్ష సాధింపు అంటారా అని ప్రశ్నించారు.
కాగా ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సైతం ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో పూర్తిస్థాయి దర్యాఫ్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మార్ కేసులో తాను ఎప్పటి నుండో పోరాడుతున్నానని నా ప్రయత్నం ఫలించిందన్నారు. విచారణలో కక్ష సాధింపు లేదన్నారు. కక్ష సాధింపు అంటే గతంలో పరిటాల హత్య కేసులో జగన్పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తండ్రే సిబిఐ విచారణ జరిపించారని అది కక్ష సాధింపు కానప్పుడు ఇది ఎలా అవుతుందన్నారు. ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గానికి ఎమ్మార్ అక్రమాలతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. నాయకులు తప్పు చేస్తే ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.