జగన్, ఎమ్మార్ కేసుల్లో ఎవరెవరు ఇరుక్కుంటారు?
ప్రాథమిక విచారణలో కంపెనీల పైనే కాకుండా కొందరు వ్యక్తులను కూడా హైకోర్టు తప్పుపట్టిందని వారిపైనా క్రిమినల్ కేసు పెట్టి విచారణ చేసే అవకాశముందని మంత్రి శంకర్ రావు తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. అక్రమాలలో జగన్ది ఉన్నప్పటికీ నాటి మంత్రివర్గానిది సైతం ఉంటుందని అన్నారు. ప్రజల ఆస్తులు కాపాడటానికి శంకర్ రావు ఎన్ని బెదిరింపులు వచ్చినా బెదర లేదని ఆయన ఎపి మరో అన్నా హజారే అని అన్నారు. ఎపిఐఐసిలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు, అనధికారులు, ప్రయివేటు వ్యక్తులు లూటీ చేస్తే కళ్లు మూసుకున్నారని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఆయా కంపెనీలపై గూడుపుఠాణీ, చీటింగ్ కేసులు పెట్టి విచారణ జరిపించాలన్నారు.
హైకోర్టు తీర్పు ద్వారా సామాన్యునికి కూడా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని విశ్వాసం కలిగిందన్నారు. తన పిటిషన్ కక్ష సాధింపు కాదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసు వేయలేదన్నారు. కాగా కడప జిల్లా న్యాయవాది షేర్వాణి మాట్లాడుతూ తన పిటిషన్ డిస్మిస్ చేసినప్పటికీ నాటి ప్రభుత్వ అక్రమాలపై హైకోర్టు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశించడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తాను కోరుకున్నది అదేనని అన్నారు. తన పిటిషన్ సాంకేతిక కారణాల వల్ల నిరాకరించారన్నారు. కాగా సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టిడిపి నేత పయ్యావుల కేశవ్ తదితరులు కోర్టు తీర్పును స్వాగతించారు. జగన్ ఆస్తులు అక్రమాలు అని తాము ఎప్పటి నుండో చేస్తున్న పోరాటం ఇప్పుడు రుజువయ్యే అవకాశం ఉందన్నారు.